మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను జీహెచ్ఎంసీ చట్టంలో ఉంచుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలక చట్టం స్ఫూర్తిగా.. నూతన జీహెచ్ఎంసీ చట్టం తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ నగర పౌరులకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పురపాలన అందించేందుకు జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
'కొత్త మున్సిపల్ చట్టంలోని కీలక అంశాలను జీహెచ్ఎంసీ నూతన చట్టంలో పొందుపరుస్తున్నాం. నిర్మాణ అనుమతులు, శానిటేషన్, గ్రీనరీ అంశాలకు ప్రాధాన్యం. పౌరులకు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యం. టీఎస్ బీపాస్ విధానానికి అవసరమైన చర్యలు చేపడుతాం. హెచ్ఎండీఏ అనుమతుల్లోనూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని' కేటీఆర్ వెల్లడించారు.